వెనుజువెలా వినాశనానికి అమెరికా కంకణం

వెనుజువెలా వినాశనానికి అమెరికా కంకణం
X

వెనుకబడిన, బలహీమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాటవినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యంకాకపోతే దురాక్రమణ, యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా సామ్రాజ్యవాదం అవలంబిస్తున్న విధానంగా ఉంది. నేడు వెనిజువెలాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్ షిప్‌లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, క్షిపణులు మొదలైన ఆయుధ సామాగ్రితోపాటు 10 వేలమంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి ట్రంప్ పంపాడు. వీరిలో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా 2-9-20 25న వెనిజువెలా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజువెలా మారకద్రవ్యాల రవాణా చేస్తున్నదని సాకులు చెబుతున్నది.

మారకద్రవ్యాలకు నిలయంగా ఉన్న వెనిజువెలా అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని, అందుకే దానిపై దాడి చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ, దాని దోపిడీ విధానాలను, యుద్ధోన్మాదాన్ని మరుగుపరుస్తున్నది. వెనిజువెలా దేశంపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం మొదలైనవి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999 లో తొలిసారి ఆటంకం ఎదురైంది. 1999లో హ్యూగో చావేజ్ వెనిజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తనను సోషలిస్టు గాను, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా ఆయన ప్రకటించుకున్నాడు. అమెరికా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ పై తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆనాటి జార్జిబుస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వెనిజువెలా పేర్కొంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

బొలీవియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో వెనిజువెలా అమెరికా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. దీని ద్వారా అమెరికా చర్యలను వెనిజువెలా వ్యతిరేకించింది. చావేజ్ మరణం తర్వాత 2013 ఏఫ్రిల్ లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి వెనిజువెలా అధ్యక్షుడు అయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.ఈయన పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం పరిశ్రమల వంటివి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. 2014లో దేశంలో హింసను ప్రోత్సహించిన ముగ్గురు అమెరికా దౌత్యవేత్తలను దేశం నుంచి మదురో ప్రభుత్వం బహిష్కరించింది. 2019లో వెనిజువెలా సంక్షోభ సమయంలో మదురో ప్రభుత్వ వ్యతిరేకి అయిన జువాన్ గైడోనూ తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నికోలస్ మదురో ప్రభుత్వం అమెరికాతో సంబంధాలు తెచ్చుకున్నట్లు ప్రకటించింది. 2023లో ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ గైడ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించరాదని ఓటు వేయడంతో ఆ వాదన వెడల అమెరికా మౌనం వహించింది.

అమెరికా తమ చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటున్నదని వెనిజువెలా వెల్లడించడంతో అమెరికాకు చెందిన డెలా వేర్ న్యాయమూర్తి అప్పులు తీర్చడానికి చమురు అమ్మకం గురించి వెనిజువెలాను ఆదేశించాడు. బిలియన్ల డాలర్ల అప్పు తీర్చడానికి మోసపూరితంగా చమురు కంపెనీ సిట్గోను విక్రయించడానికి అధికారం ఇస్తూ అమెరికా కోర్టు నిర్ణయాన్ని వెనిజువెలా ఉపాధ్యక్షుడు, ఆ దేశ పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించి ఆ తీర్పును తిరస్కరించాడు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ అయిన వెనిజువెలా పెట్రోలియోన్ డి వెనిజులా (పిడియుఎస్‌ఎ) హ్యూస్టన్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన సిట్గో, రుణదాతలకు 20 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బాకీ ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇంతకు ముందు ఇది లాభదాయకంగా ఉన్న చమురు పరిశ్రమ. దీన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా పెట్టిన అనేక ఆంక్షల వల్ల సంక్షోభంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కంపెనీల రుణదారుల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలిక్స్ కూడా ఉంది. బంగారం, వజ్రాలు, ఇనుము, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న క్రిస్టినాస్ గనిని 2008లో స్వాధీనం చేసుకుని జాతీయం చేసినందుకు 2019లో వెనిజువెలా ప్రభుత్వం క్రిస్టలెక్స్‌కు 1.2 బిలియన్లు బాకీ ఉందని మరొక అమెరికా కోర్టు పేర్కొంది.

సార్వభౌమాధికారం గల ఒక స్వతంత్ర దేశం ఆ దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు, ఆ దేశ ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజువెలా అలాంటి దేశం కాబట్టి పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి. తీర్పు ఇచ్చే అధికారం కూడా వెనిజువెలా కోర్టులకే ఉంటుంది. అమెరికా ప్రపంచ పోలీసు పాత్ర పోషిస్తూ లేని అధికారాలను తీసుకుంటున్నది. 2023 నాటికి 303 బిలియన్ బ్యారెళ్ల్లగా అంచనాతో ప్రపంచం లోనే అత్యధిక చమురు నిల్వలను వెనిజువెలా కలిగి ఉంది. అయినా ఆ దేశం 2023లో కేవలం 4.05 బిలియన్ల ముడిచమురును మాత్రమే ఎగుమతి చేసింది. ఇది ఇతర చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతి కన్నా చాలా తక్కువ. ఇంతకు ముందు ట్రంప్ ప్రభుత్వ పాలనలో ఇతర దేశాలు వెనిజువెలా నుంచి చమురు కొనవద్దని చేసిన హెచ్చరికలే అందుకు కారణంగా ఉంది. ఈ విధంగా వెనిజువెలా దేశాన్ని సైనికంగా బెదిరించడమే కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు అమెరికా చేసింది. వెనిజువెలాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టిపోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు హెరాల్ అనే అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం ప్రకటనను వెనిజువెలా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్యను చూపిస్తోందని పేర్కొంది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచేలా ఉందని మండిపడింది. వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమైనది. అమెరికా ఎప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా ఉల్లంగిస్తూనే ఉంది. వాస్తవంలేని సాకులతో ఇరాక్ దాడి చేసింది. కొద్ది నెలల క్రితం ఇరాన్‌పై దాడి చేసింది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (430 కోట్ల రూపాయలు) బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి బెదిరింపుల ద్వారా వెనుకబడిన దేశాలన్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నదే అమెరికా విధానం. వెనిజువెలాపై సైనిక చర్యను 70% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సిబిఎన్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యాలతో ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్ల అయ్యిందని, వెనిజువెలాపై సైనిక జోక్యం చేసుకోవద్దని అమెరికన్లు కోరుతున్నారు. వెనిజువెలాపై అమెరికా ఆంక్షలను, దాడి చేసే ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, వెనుకబడిన దేశాలను బెదిరించే విధానాలను మానుకోవాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.


బొల్లిముంత సాంబశివరావు

98859 83526

Tags

Next Story