మేడారం సమ్మక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని, జాతరలకు జాతీయ హోదా అంటూ ప్రత్యేకమేమీ ఉండదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ను ఆయన శనివారం పరిశీలించారు. రైల్వే తయారీ యూనిట్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. నిర్మాణ స్థలంలో భద్రతా అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోందని అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75% వరకు పూర్తయ్యాయని, వచ్చే సంవత్సరం వరకు పనులు పూర్తి చేసి కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసి దేశానికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గత 60 ఏళ్ల కల అని, ఆ స్వప్నం వచ్చే సంవత్సరం తెలంగాణ ప్రజలకు కలిసి రాబోతోందని చెప్పారు.
ఇక్కడ పరిశ్రమలో స్థానిక యువతకే ఉద్యోగ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎంతో అత్యాధునికమైన కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. 2023లో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రూ. 521 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్విఎన్ఎల్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని తెలియజేశారు. మెయిన్ షాప్, టెస్ట్ షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డ్, అడ్మిన్ బ్లాక్, రెస్ట్ హౌస్, క్యాంటీన్, సెక్యూరిటీ, టాయిలెట్ బ్లాక్స్, బౌండరీ వాల్, ఆర్యుబి, అంతర్గత రైల్వే ట్రాక్, రోడ్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ క్యాంటీన్లను ఆర్ఎంయులో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 1 మెగావాట్ల పైకప్పు సోలార్ ప్లాంట్, సహజ పగటిపూట లైటింగ్ సహజ వెంటిలేషన్, ఎల్ఇడి లైటింగ్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్, వర్షపు నీటి సేకరణ మొదలైన పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఆర్ఎంయులో 16 కోచ్ మెము రేక్లను తయారుచేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాబోయే రైల్వే తయారీ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు అపూర్వమైన అభివృద్ధిని సాధిస్తున్నాయనిపేర్కొన్నారు.
ముందుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగత ప్రసంగం చేశారు. ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలను ఆర్వీఎన్ ఏల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్ మీడియాకు వివరించారు. శనివారం ఉదయం కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా పరిశీలించారు, అక్కడ రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రయాణికుల అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా స్టేషన్లో అందించిన పయాణికుల సౌకర్యాలు సౌకర్యాలను ఆయన సమీక్షించారు.దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బిజయ్ కుమార్ రత్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఆర్విఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పి.వి. సాయిప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
-
Home
-
Menu
