చికెన్ షాపులు బంద్

చికెన్ షాపులు బంద్
X

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చికెన్ వ్యాపారం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. డీలర్లకు ఇవ్వాల్సిన పర్సంటేజ్‌ను తగ్గించడంతో చికెన్ షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పర్సంటేజ్ తగ్గింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలు మార్జిన్లు తగ్గించడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. చికెన్ షాపులు మూతపడడంతో మాంసాహార ప్రియులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అసోసియేషన్ పిలుపుతో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో చికెన్ షాపులు మూతపడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో షాపులు యథావిధిగా తెరుచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో బంద్‌కు మద్దతుగా ఉన్న అసోసియేషన్ సభ్యులు షాపులు తెరిచిన యజమానులను అడ్డుకోవడంతో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి.

అందరూ ఐక్యంగా పోరాడితేనే న్యాయం జరుగు తుందని అసోసియేషన్ సభ్యులు అన్నారు. అయితే రోజువారీ వ్యాపారం ఆగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు షాపు యజమానులు చెబుతున్నారు.కొన్ని చోట్ల తోపులాటలు జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జిల్లాల్లోనూ చికెన్ షాప్‌లు మూత పడ్డాయి. మార్జిన్ తగ్గించటంతో తమకు గిట్టుబాటు కావటం లేదని చికెన్ షాపుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను తీసుకురావడానికి ట్రావెలింగ్ ఖర్చు, షాపు రెంట్లు, వర్కర్ల జీతాలు పోను. తమను కనీస లాభం కూడా మిగలటం లేదని వాపోతున్నారు. పౌల్ట్రీ యజమానులు, ప్రభుత్వం నుంచి రాయితీ లు పొందుతూ తక్కువ రేటుకే కోళ్లను పెంచుతున్నారని తెలిపారు. కానీ షాపులకు వేసే కోళ్లపై మార్జిన్ తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోలాగానే చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని చికెన్ షాపుల యజమానులు వేడుకుంటున్నారు.

కిలో చికెన్ పై 40 రూపాయలు మార్జిన్ ఇవ్వాలని, లేనిపక్షంలో వినియోగదారుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని విధానపరంగా చికెన్ ధరలు, కమిషన్ మార్జిన్ ధరలు నిర్ణయించాలని చికెన్ అమ్మకందారుల సంఘాలు కోరుతున్నారు. చిల్లర వ్యాపారులను లేకుండా చేయాలన్న కుట్ర వీడి పౌల్ట్రీ కంపెనీలు ముందుకు రాకపోతే దుకాణాల నిరవధిక బంద్ కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు వారు ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి చికెన్ వ్యాపారులు భారీగా తరలివచ్చారు.

Tags

Next Story