డిజిటల్ అరెస్ట్.. మూడు రోజులు నిర్భందంలో డాక్టర్ కుటుంబం..

డిజిటల్ అరెస్ట్.. మూడు రోజులు నిర్భందంలో డాక్టర్ కుటుంబం..
X

సైబర్ ఉచ్చు నుంచి డాక్టర్ కుటుంబాన్ని రక్షించిన టిజిసిఎస్‌బి

డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు

టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్

మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ అధికారులమని సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడి డిజిటల్ అరెస్టు ఉచ్చును నుంచి డాక్టర్ కుటుంబాన్ని కాపాడినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలో నీలా నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న 80 ఏళ్ల డాక్టర్ బుద్ధరాజు సుబ్బరాజు ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ మోసానికి బాధితులయ్యారన్నారు. నవంబర్ 20వ తేదీ డాక్టర్ సుబ్బరాజుకు సిబిఐ అధికారులమని వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందని, ఆయన ఆధార్ కార్డుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా ఉందని, అది ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులలో ఉపయోగించబడిందని అబద్ధాలు చెప్పి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసినట్లు చెప్పారు. దీంతో పాటు సిబిఐ పర్యవేక్షణలో కుటుంబాన్ని ఉంచామని హెచ్చరించి, ఎవరితోనూ మాట్లాడకూడదని, ప్రతి గంటకూ వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్‌డిలు, ఇంట్లో ఉన్న నగదు వివరాలను మోసగాళ్లు తెలుసుకున్నారు. ఎఫ్‌డిలను వెంటనే రద్దు చేసి, ఆ డబ్బును వారికి పంపడానికి సిద్ధం కావాలని మూడు రోజులుగా కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేశారు. ఈ కారణంగా ఆ కుటుంబం మూడు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇంట్లోనే ఉన్నారని డైరెక్టర్ శిఖా గోయొల్ వెల్లడించారు.

సహాయకుడి అప్రమత్తతతో కాపాడిన పోలీసులు

కుటుంబం ఫోన్ ఎత్తకపోవడం, డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రికి రాకపోవడాన్ని గమనించిన ఆయన సహాయకుడు అనుమానం వ్యక్తం చేశాడు. పదేపదే ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ సహాయకుడు నవంబర్ 23 రాత్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పి అశోక్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్‌లు డాక్టర్ సుబ్బరాజు ఇంటికి చేరుకున్నారు. వెంటనే మోసగాళ్లతో ఆ కుటుంబానికి ఉన్న సమస్యను అడ్డుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యల వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం తప్పినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ వెల్లడించారు. ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక దర్యాప్తును ప్రారంభించారని, మోసగాళ్ల ఐపి చిరునామాలు, కాల్ రూటింగ్ వివరాలు, పరికరాల గుర్తింపు సంఖ్యలను విశ్లేషిస్తున్నామన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి చర్యలు కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు.

డిజిటల్ అరెస్టులు ఉండవు

ఈ సంఘటల సందర్భంగా టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ పలు సూచనలు చేశారు. పోలీసులు, సిబిఐ, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎప్పుడూ డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు చేయదని, ఏ అధికారికి కూడా డబ్బును ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పే అధికారం చట్టంలో లేదని స్పష్టం చేశారు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. సమయోచితంగా స్పందించి వృద్ధుడి కుటుంబాన్ని రక్షించిన డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.

Tags

Next Story