నేడు తిరుమలలో కార్తీక వన భోజనం

తిరుమల: కార్తీక వన భోజన కార్యక్రమం శనివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

Tags

Next Story