‘సర్పంచ్’ నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి

భార్య శ్రీజతో నామినేషన్ వేయించిన యువకుడు
స్క్రూటినీకి వెళ్లకుండా కొత్త జంటను ఠాణాలో ఉంచిన పోలీసులు
ఎంఎల్ఎ చింతా ప్రభాకర్ జోక్యం..
బాధితులకు అండగా ఉంటామని భరోసా
సంగారెడ్డి మండలం, తాళ్లపల్లిలో ఘటన
మన తెలంగాణ/సంగారెడ్డి ః పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని నిరాశ చెందిన యువకుడు కులాంతర వివాహం చేసుకుని తన భార్య శ్రీజతో నామినేషన్ వేయించాడు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలావున్నాయి. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సికి రిజర్వ్ కాగా, ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. కానీ నవదంపతుల చర్యతో ఇప్పుడు ఎన్నిక తప్పడం లేదు. బిఆర్ఎస్ మద్దతుతో శ్రీజ నామినేషన్ వేయగా, స్క్రూటినీకి వెళ్లకుండా పోలీసులు అతనిని, అతని భార్యను పోలీస్ స్టేషన్లో ఉంచారు. తాము స్క్రూటినీకి వెళ్లాలని నవ దంపతులు చెప్పినప్పటికీ, విచారించి పంపుతామని పోలీసులు వారించారు.
ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీస్లతో మాట్లాడి చంద్రశేఖర్ గౌడ్ను, అతని భార్యను స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. కొత్త జంటకు అండగా నిలిచారు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని కొత్త జంట ఈ సందర్భంగా తెలిపింది. ఆ తర్వాత కొత్త జంట పోలీస్ స్టేషన్ నుంచి స్క్రూటినీ కేంద్రానికి వెళ్లింది. అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ విషయం సంగారెడ్డి ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
-
Home
-
Menu
