సర్పంచ్లకే అంగన్వాడీ కేంద్రాల బాధ్యత

సర్పంచ్ ఛైర్మన్గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ
పౌష్టికాహార నాణ్యత, పంపిణీని తనిఖీ చేయనున్న కమిటీ
అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారాలు అప్పగించింది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా సర్పంచ్లే చూసుకునే విధంగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రెండేళ్లపాటు గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో చాలాచోట్ల పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొలువుదీరిన కొత్త పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్పంచ్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్గా 11 మంది సభ్యులు ఉంటారు. అంగన్వాడీ టీచర్ కన్వీనర్గా, ఏఎన్ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతీ నెలా అంగన్వాడీ కేంద్రాలకు అందుతున్న బాలామృతం, గుడ్లు, పాలు, బియ్యం, పప్పు, వంటి సరుకుల నాణ్యతను, పంపిణీ ప్రక్రియను తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పరిశీలిస్తుంది. లక్షల రూపాయల విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీ ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించనున్నాయి.
-
Home
-
Menu
