ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుపతి: తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఇఒ వెంకయ్య చౌదరి, ఆలయ డెప్యూటీ ఇఒ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu
